సింగపూర్లో ఉన్న భారతీయులకు ఎలాంటి ఢోకాలేదని సింగపూర్ ప్రధాని హామీఇచ్చారు. కరోనా కష్టాలకాలంలో తమ దేశంలో ఉన్న భారత పౌరులకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. సింగపూర్ వాసుల మాదిరిగానే.. సింగపూర్లో పనిచేస్తున్న భారతీయ పౌరులను కూడా కంటికి రెప్పలా చూసుకుంటామని ప్రధాని లీ హ్సేన్ లూంగ్ భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. సింగపూర్, భారతదేశంలోఉన్న కరోనా మహమ్మారి పరిస్థితి గురించి తాను ప్రధాని మోదీతో టెలిఫోన్ చర్చలు జరిపినట్లు లీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన భారత పౌరులు సింగపూర్కు ఎంతో కృషి చేశారని...వారిని కూడా కాపాడే బాధ్యత మాకు ఉందని తెలిపారు. కాగా భారత్ లో ఉన్న సింగపూర్ వాసులను తరలించడంలో భారత్ చేసిన సహాయం మరువలేనిదని అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.